23.2 C
Hyderabad
May 8, 2024 00: 15 AM
Slider ఖమ్మం

డ్రై డే ను పకడ్బందీగా చేపట్టాలి

#Udai Nagar

డ్రై డే ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డ్రై డే ను పురస్కరించుకుని రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్ లో పర్యటించి ప్రజల్లో డెంగ్యూ దోమల నియంత్రణ, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంటింటికి తిరుగుతూ, వృధాగా ఉన్న వస్తువులు, నీరు నిల్వ ఉన్న వస్తువులు ప్రదేశాలు పరిశీలించి, నీటి నిల్వతో డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయని, నీటి నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

వాటర్ బాటిళ్లు, మట్టి కుండలు, మట్టి ఇతర పాత్రలు, వస్తువులను పరిశీలించి, నీరు చేరకుండా జాగ్రత్తలు చేపట్టాలని, కేవలం మన ఇల్లు కాకుండా, పరిసరాలు పరిశుభ్రంగా, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. డెంగ్యూ పాజిటివ్ కేసు విషయంలో తీసుకున్న చర్యలు గురించి వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు.

పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందించి, ఆ కేసు ఇంటి లోపల, బయట, పరిసరాల్లో పైరిత్రం పిచికారీ చేయించి, వ్యాధి ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారి చుట్టుప్రక్కల ఇంటింటికి సర్వే చేసి శాంపిల్స్ సేకరించి లక్షణాలను గుర్తించేందుకు పరీక్షలు చేయాలని, తద్వారా డెంగ్యూకి గురైన ఇంటితో పాటు చుట్టూ ప్రక్కల ఇళ్లల్లో కూడా వ్యాధి ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

వైద్య శిబిరాన్ని నిర్వహించాలన్నారు. ఈడీస్ ఈజిప్టే అనే దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని, నవజాత శిశువులు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ కలిగియున్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. దోమల నియంత్రణతో వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన తెలిపారు.

ప్రతి మంగళ, శుక్రవారాలు డ్రై డే లుగా పాటించాలని, ఆ రోజుల్లో ఇల్లు, ఇంటి పరిసరాలలో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, ఇంటిలో ఉన్న నీటి తొట్టెలు, సిమెంట్ కుండీలు, డ్రమ్ములలో ఉన్న నీటిని మొత్తం పారబోసి, శుభ్రంగా కడిగి, ఆరబెట్టినా తరవాత నీరు నింపుకోవాలన్నారు. దీనివల్ల ఈడిస్ దోమ జీవిత చక్రానికి అంతరాయం ఏర్పడి, లార్వాలు అంతరిస్తాయన్నారు. దోమల నియంత్రణలో ప్రజలు పాలుపంచుకోవాలని కలెక్టర్ తెలిపారు.

పనికిరాని గుంతలను, లోతట్టు ప్రదేశాలను, వాడని బావులను పూడ్చి, నీరు నిల్వ కాకుండా చూడాలన్నారు. దోమల నివారణకు యాంటీ లార్వా కార్యాచరణ చేయాలని, నీరు నిల్వ ఉన్నచోట ఆయిల్ బాల్స్ వేయాలని, పాగింగ్ నిర్వహించడం ద్వారా దోమల వృద్దిని కట్టడికి చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వి.వి. అప్పారావు, జిల్లా మలేరియా అధికారి లక్ష్మీనారాయణ, డివిజనల్ పంచాయతీ అధికారి పుల్లారావు, రఘునాథపాలెం ఎంపిడివో రామకృష్ణ, ఎంపీఓ శ్రీనివాస రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డా. సంధ్యారాణి, గ్రామ సర్పంచ్ కె. లలిత, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అధికార పార్టీ ధర్నా చేస్తే ఓకే… నిర్వాసితులు ధర్నా చేస్తే ఊరుకోం

Satyam NEWS

వలస దుఃఖం

Satyam NEWS

మద్దతు ధర రాక మనస్తాపంతో పత్తి రైతు ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment