వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామానికి చెందిన గడ్డం సింధు ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీటు సాధించి సత్తా చాటింది. గ్రామానికి చెందిన గడ్డం భీమన్న సాధారణ రైతు. తన పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలనే పట్టుదలతో బాగా చదివించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గడ్డం సింధు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆత్మకూర్ పట్టణంలోని ఎస్వీఎస్ పాఠశాలల్లో చదువుకుంది. తరువాత ఇంటర్మీడియట్ వరంగల్ జిల్లా అసంపర్తి టీఎస్ఆర్జేసీలో చదివింది. నీట్ పరీక్షలో 393 మార్కులు సాధించి బీసీ -ఎ కేటగిరీలో తెలంగాణ స్టేట్ మూడో ర్యాంక్. బుధవారం కౌన్సెలింగ్లో మెదక్ జిల్లా మహేశ్వర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో చేరింది.
తన కూతురికి ఎంబీబీఎస్ లో సీటు రావడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా భీమన్న తెలిపారు. తన చిన్ననాటి స్నేహితుడు భీమన్న కూతురు మెడిసిన్ సీటు సాధించడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయుడు కె. హన్మంతరావు ఆయన మిత్ర బృందం హర్షం వ్యక్తం చేశారు.