అంతర్జాతీయ స్థాయిలో షేక్ సాఖిబ్ భాష నాలుగు బంగారు పతకాలు తేవడం జిల్లాకు గర్వకారణం అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. ఎంపీ ఆదాలను శుక్రవారం ఆయన ఇంట్లో కలిసిన సాఖిబ్ కు నాలుగు బంగారు పతకాలను మెడలో వేసి గౌరవించారు. శాలువాను కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాఖి బ్ను రైల్వేలో ఉద్యోగానికి సిఫారసు చేస్తానని, ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
న్యూజిలాండ్ లోని ఆక్లాండ్లో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో షేక్ సాఖిబ్ భాష నాలుగు బంగారు పతకాలను సాధించాడు. స్కాట్ 330 కిలోల విభాగంలో బంగారు పతకం, బెంచ్ ప్రెస్ 247 కిలోల విభాగంలో బంగారు పతకం, డెడ్ లిఫ్ట్ 310 కిలోల విభాగంలో బంగారు పతకం, ఓవరాల్ 887 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన సాఖిబ్ బాషా నెల్లూరుకు చెందినవాడు.
ఇతనికి పోటీల్లో పాల్గొనేందుకు సరైన ఆర్థిక సహకారం లభించక ఇబ్బందులు పడుతున్నాడు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికీ 70 కి పైగా పతకాలను సాధించాడు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, నరసింహారావు, సయ్యద్ ఫయాజ్ ఉద్దీన్, సోహైల్, ఇమ్రాన్, నజీబ్, ఇంతియాజ్, నవీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.