నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండి ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ఈ -ఆఫీస్ విధానం అమలు చేయాలని, జిల్లా అధికారులు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు వంద శాతం ఈ-ఆఫీస్ విధానం అమలు చేయాలన్నారు.
సోమవారం నుండి ఈ ఆఫీస్ విధానం ద్వారానే ఫైళ్లను పరిశీలించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు లిఖితపూర్వక ముందు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లకూడదని అన్నారు. జిల్లా కలెక్టరేట్ లో అన్ని శాఖల ఫైళ్లను ఫాలోఅప్ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ కె భాస్కర్ రావు, జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్, జిల్లా అధికారులు, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ నవీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.