శబరిమల అయ్యప్ప ఆలయం జూన్ 14న తెరుచుకోనున్నది. నెలవారీ పూజల కోసం జూన్ 14 సాయంత్రం ఆలయాన్ని తెరుస్తున్నారు. ఆలయ తాంత్రిలు పూజారులతో చర్చలు జరిపిన అనంతరం ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది.
అదే విధంగా జూన్ 19 నుండి నెలవారీ పూజలు, ఆలయ ఉత్సవాలను నిర్వహించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం జూన్ 19 న ఆలయ ఉత్సవం ప్రారంభం అవుతుంది. జూన్ 20 న పంపా నది వద్ద హారతి వేడుక నిర్వహిస్తారు.
వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్న వారు సన్నిధానంలోకి వెళ్ళవచ్చునని బోర్డు వెల్లడించింది. ఇతర రాష్ట్రాల ప్రజలు, రిజిస్ట్రేషన్ సమయంలో కరోనా నెగిటివ్ రిపోర్ట్ ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఐసిఎంఆర్ ఆమోదించిన ల్యాబ్ నుండి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుందని దేవస్వం బోర్డు అధ్యక్షుడు ఎన్. వాసు తెలిపారు.