సమస్యల వలయంలో చిక్కుకుని బెహెరీన్ దేశంలో మరణించిన మహమ్మద్ మగ్బూల్ దయనీయమైన కథ ఇది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్ గ్రామానికి చెందిన మగ్బూల్ కుట్టు మిషన్ పని చేసుకునేవాడు. అతడికి ముగ్గురు ఆడపిల్లలు.
వారిని పెంచి పోషించుకోవడానికి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో అతను బెహరీన్ దేశానికి వెళ్లాడు. అక్కడ నుంచి డబ్బులు పంపించాడు. పెద్ద కుమార్తె వివాహం చేశాడు. మరో ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసేందుకు మళ్లీ బెహరీన్ వెళ్లాడు. అతని కష్టాలు ఇలా ఉండగానే అల్లుడు అనారోగ్యంతో మరణించాడు.
దాంతో పెద్ద కుమార్తె ఆమె ముగ్గురు పిల్లలు మళ్లీ తన ఇంటికే వచ్చేశారు. మళ్లీ కొత్త కష్టాలు మొదలయ్యాయి. బెహరీన్ లో మరింత కష్టపడ్డాడు. ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోలేదు. స్వగ్రామంలో ఉన్న ఇల్లు అమ్మేశాడు. కష్టాలు తీరలేదు. కుమార్తెల వివాహానికి అప్పులు అయ్యాయి. తీర్చలేకపోయాడు.
మళ్లీ బెహరీన్ వెళ్లి పని చేయడం మొదలు పెట్టాడు. ఈ లోపు అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. బెహరీన్ లో వైద్యం చేయించుకోవడం సాధ్యం కాదు. ఇంటికి తిరిగి వచ్చేద్దామనుకున్నాడు. ఈ లోపు కరోనా మహమ్మారి వచ్చేసింది. విమానాలు రద్దయ్యాయి. అక్కడ మగ్బూల్ ఆరోగ్యం క్షీణించింది.
పట్టించుకునే నాథుడులేక తనువు చాలించాడు. ఈ నెల 13న మగ్బూల్ మరణించాడు….. కథ పూర్తి కాలేదు…. మగ్బూల్ మృతదేహం అక్కడే ఉండిపోయింది….. లాక్ డౌన్….. విమానాలు లేవు… భార్యా పిల్లలకు కడసారి చూపు అయినా దక్కుతుందా? సాయం చేసే వారి కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తున్నది………