రాజకీయాలతో సంబంధం లేకుండా పలు అంశాలను తనదైన శైలిలో నిస్పక్షపాతంగా ప్రజల ముందు ఉంచే మాజీ ఎంపి ఉండవెల్లి అరుణ్ కుమార్ తాజా పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ఇటీవల ఏపిలో చాలా పరిణామాలు జరిగినా ఉండవెల్లి మాత్రం వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిస్పాక్షిక విశ్లేషణ చేసిన ఉండవెల్లిని అప్పటిలో చంద్రబాబునాయుడి వ్యతికవర్గంగా ముద్ర వేశారు.
ఆ తర్వాత జన సేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి కొన్ని విషయాలపై తన అభిప్రాయాలు చెప్పినపుడు ఆయన జనసేనలో చేరతారని అందరూ అనుకున్నారు. అయితే తనకు రాజకీయాలతో సంబంధం లేదని ఉండవెల్లి పదే పదే చెబుతూనే ఉంటారు. ఉండవెల్లికి ఆప్త మిత్రుడైన వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు కావడం వల్ల వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయన మాట్లాడతారని చాలా మంది అనుకున్నారు.
అయితే ఉండవెల్లి మాత్రం ఆ మాటలను అంగీకరించలేదు. 151 సీట్లు రావడం నిరంకుశత్వానికి దారితీస్తుందని కూడా ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో వ్యాఖ్యానించారు. పట్టరాని మెజారిటీ వచ్చిన ప్రభుత్వాలు పూర్తి కాలం మనుగడ సాగించలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తన మిత్రుడి కుమారుడు అయినందున ‘సాఫ్ట్ కార్నర్’ ఉంటే ఉండవచ్చు కానీ పాలనాపరమైన తప్పులను తాను సమర్ధించేది లేదని ఉండవెల్లి ఇప్పటికే స్పష్టం చేశారు.
త్వరలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది గడుస్తున్నందున ఈ ఏడాది పాలపై ఉండవెల్లిని వ్యాఖ్యానించాల్సిందిగా కొద్ది రోజులుగా ఆయనను చాలా మంది కోరుతున్నారు. రాష్ట్ర హైకోర్టు పలు అంశాలలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టడం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ ను నేరుగా కులంపేరుతో విమర్శించడం వరకూ చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగాయి.
రాజధాని ని అమరావతి నుంచి మార్చే విషయంలో కూడా కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. తాజాగా పేద వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కూడా పలు వివాదాలు నెలకొంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఆవ భూములకు సంబంధించి పెను వివాదం నడుస్తున్నది. ఇలాంటి అంశాలపై ఉండవెల్లి అరుణ్ కుమార్ ఎక్సపర్ట్ కామెంట్రీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.