ఆధార్ నవీకరణ నువెంటనే చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు ఆధార్ నమోదు, నవీకరణలు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 5 నుండి 15 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు ఆధార్ కేంద్రాలలో నవీకరణకు ఎలాంటి చార్జీలు ఉండవని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పౌర సేవలను పొందాలనుకునే వారు ఆధార్ నవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పుట్టిన పిల్లలకు ఆధార్ పొందేలా ఆస్పత్రుల్లోనే చర్యలు చేపడుతున్నట్లు, అన్ని ఆసుపత్రుల్లో ఈ ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆధార్ ప్రక్రియ చేపట్టి వంద శాతం పూర్తికి కార్యాచరణ చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, యుఐడిఏఐ హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజర్ జి. శ్రీనివాసరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జిల్లా సంక్షేమ అధికారిణి సంధ్యారాణి, పోస్టల్ సూపరింటెండెంట్ బి. రవికుమార్, ఏసీపీ ప్రసన్నకుమార్, ఆర్ఎంఓ రాజశేఖర్, ఇడిఎమ్ దుర్గాప్రసాద్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.