సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న అక్రమ వెంచర్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్, తేజావత్ రాజా నాయక్,జక్కుల వీరయ్య,కోతి సంపత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 30 ఎకరాల అక్రమ వెంచర్లు వెలిశాయని,డి టి సి పి అనుమతులు లేకుండా నాలా అనుమతులతో అక్రమ రిజిస్ట్రేషన్ లు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.మున్సిపాల్టీకి 10 శాతం భూమి ఇవ్వకుండా కేవలం మ్యాప్ లు ద్వారా ప్రజలకు చూపించి ప్లాట్లను విక్రయాలు చేస్తున్నారని అన్నారు.ఇప్పటికే మున్సిపాలిటీకి 10 కోట్ల ఆదాయానికి గండి పడిందని అన్నారు.మున్సిపాల్టీ అధికారులు డి టి సి పి అనుమతి లేని వెంచర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అనుమతి లేని వెంచర్లకు రిజిస్ట్రేషన్ లు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.హుజూర్ నగర్ లోని ఫణిగిరి సీతారామచంద్ర స్వామి గట్టుకు వెళ్ళే దారిలో వి.పి.ఆర్ వెంచర్లో మున్సిపాల్టీకి చెందిన 2,300 గజాల లే అవుట్ స్థలం మాయం చేశారని,ఆ స్థలాన్ని వెంటనే మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్