తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయాన్ని వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ నిఘా మరియు భద్రతాధికారి నరసింహ కిషోర్ తెలిపారు.
టీటీడీ నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంలోనికి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడం, వీడియో చిత్రీకరించడం నేరమన్నది భక్తులందరికీ తెలుసు. నిన్న రాత్రి (07-05-2023) తిరుమలలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడిన నేపథ్యంలో, దాదాపు రెండు గంటల పాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.
ఆ సమయంలోనే సదరు భక్తుడు పెన్ కెమెరా ద్వారా వీడియో చిత్రీకరించినట్టు అనుమానిస్తున్నామన్నారు. అన్నీ తెలిసి ఒక భక్తుడు ఇలా చేయడం చాలా బాధాకరము. సీసీటీవీల ద్వారా సదరు భక్తుడిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని టీటీడీ నిఘా మరియు భద్రతాధికారి నరసింహ కిషోర్ తెలిపారు. టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడుతున్నామని కూడా సీవీఎస్వో తెలిపారు.