వర్షపాతం నమోదుపై వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉన్న ముందస్తు చర్యలు చేపట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. 9 సంవత్సరాలలో ఖమ్మం జిల్లాను ఎంతో సుందరంగా తీర్చిదిద్దామని గొప్పలు చెప్పుకుంటున్న స్థానిక మంత్రి మున్నేటి పరివాహక ప్రాంత ప్రజలను కాపాడడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు.
తొమ్మిదేళ్ల ఖమ్మం అభివృద్ధి రెండు రోజుల వర్షం తోనే బయటపడిందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కో ఖమ్మం నగరం ఎలా ఉందో ప్రత్యేక తెలంగాణలోనూ అంతే ఉందని విమర్శించారు. వాతావరణ శాఖ ముందే హెచ్చరిస్తున్న మున్నేటి పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడం దారుణమని అన్నారు. గత రెండు రోజుల నుండి వర్షంలోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి ధైర్యం చెబుతూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు.
బంగారు తెలంగాణలో వర్షాలు వస్తే పడవలేసుకొని తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. జలగం నగర్ కు చెందిన సతీష్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్న అతన్ని పట్టించుకునే పరిస్థితి లో నేడు ప్రభుత్వం లేదని అన్నారు.ఇంకా రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మున్నేటి పరివాహక ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని వారికి 10వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, వరి నార్లు, మిరప నార్లు పోసిన రైతులకు అండగా నిలిచి వారికి కూడా ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వి ప్రచారాల ఆర్భాటాలు తప్ప అభివృద్ధి శూన్యం అని రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో తేటతెల్లం అయిందని అన్నారు.ఎంతో కొంత డబ్బు ముట్ట జెప్పి మళ్ళీ ఎన్నికల్లో గెల్వవచ్చు అనే ఆలోచన తప్ప ముంపు బాధితులకు అండగా ఉండాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు అని విమర్శించారు.వాతావరణ శాఖ హెచ్చరికలను బేఖాతర్ చేసి ప్రభుత్వం మున్నేటి పరిసర ప్రాంత ప్రజలను కాపాడడంలో విఫలం చెందిందని అన్నారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే పతకం ప్రవేశ పెట్టి నది పరివాహక ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేసి ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆ విదమైన చర్యలు చేపట్ట కుండ ఎన్నికల హడావిడిలో భాగంగా అధికారుల తరలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్నారని విమర్శించారు. ఎఫ్ సి ఐ గోదాం నుండి మున్నేరు వరకు ఉన్న ప్రాంత ప్రజల ఇండ్లలో సామాన్లు వాహనాలు వరదకు కొట్టుకు పోయాయని ఆరోపించారు.
పరిస్థితిని తెలుసుకునేందుకు మున్నేరు పరివాహక ప్రాంతంలో పర్యటించగ తనకు అన్ని సమస్యలే ఎదురు అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్ట పోయిన బాధితులకు తక్షణమే 10వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.