ఖమ్మం జిల్లా ప్రజలకు, రైతులకు ఎంతో నష్ట దాయకంగా పరిణమించిన డోర్నకల్ – మిర్యాలగూడ నూతన రైల్వే లైన్ అలైన్మెంట్ మార్పు అంశాన్ని పునః పరిశీలిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ జైన్ తెలియజేశారని బీ ఆర్ఎన్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ఈమేరకు రైల్వే జీఎం నుంచి తనకు ప్రత్యేకించి లేఖ అందిందని నామ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు ఎటువంటి ఉపయోగం లేని ఈ రైల్వే లైన్ ను ఖమ్మం జిల్లాతో సంబంధం లేకుండా బయట నుంచి తీసుకెళితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, ఈ కొత్త రైల్వే లైన్ వల్ల ఖమ్మం జిల్లాకు చెందిన రైతాంగం, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోను ఈ నూతన రైల్వే మార్గాన్ని ఖమ్మం జిల్లాలో అనుమతించే ప్రసక్తే లేదని ఖరా ఖండిగా చెబుతూ నామ గతంలో రైల్వే మంత్రిని, రైల్వే బోర్డు చైర్మన్ ను, జనరల్ మేనేజర్ ను కలిసి, లేఖలు అందజేసిన సంగతి తెలిసిందే. ఎంపీ నామ అందజేసిన లేఖలను పరిశీలించిన రైల్వే జీఎం తాజాగా తిరుగు సమాధానం ఇచ్చారు.
ఎంపీ నామ తాజాగా చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని, సమస్య పరిష్కరిస్తామని రైల్వే జీఎం సమాధానం ఇచ్చారు. గతంలో నామ తన పార్లమెంట్ పరిధిలోని ఏ ఒక్క రైతుకు కానీ, ప్రజలకు కానీ ఈ కొత్త రైలు మార్గం వల్ల నష్టం జరిగితే సహించేది లేదని, అడ్డుకుని తీరుతానన్నారు. ఇప్పటికే జాతీయ రహదారులు, నాగార్జున సాగర్, ఇతర వాటి వల్ల రైతులు తమ విలువైన భూములను కోల్పోయి, నష్టపోయారని, మళ్లీ ఇప్పుడు తమ విలువైన భూములను కోల్పోయి, నష్టపోయారని, మళ్లీ ఇప్పుడు ఈ కొత్త రైలు మార్గం వల్ల తమ విలువైన భూములను కోల్పోవడానికి సిద్దంగా లేరని నామ రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్ళారు.
రైలు మార్గం ప్రతిపాదించిన ఏరియాల్లోని భూములు ఎంతో విలువైనవని, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పేదల ఇండ్లు భూముల్లో ఉన్నాయని తెలిపారు. తాను మొదటి నుంచి కూడా జిల్లాలో ఈ రైలు మార్గానికి వ్యతిరేకమని చెబుతూనే ఉన్నానని చెప్పారు. గతంలో జరిగిన దిశ సమావేశంలో కూడా ఈ విషయమై సంబంధింత రైల్వే అధికారులను పిలిపించి, మాట్లాడడం జరిగిందని, ఖమ్మం జిల్లాతో సంబంధం లేకుండా బయట నుంచి ఈ నూతన రైలు మార్గాన్ని నిర్మించుకోవచ్చని తాను స్వయంగా రైల్వే మంత్రిని కలసి స్పష్టం చేయడం జరిగిందని గుర్తు చేశారు.
ఇప్పటికే పలుమార్లు రైల్వే మంత్రితోను, సంబంధిత రైల్వే ఉన్నతాధికారులతోను ఈ విషయమై చర్చించడం జరిగిందని నామ చెప్పారు. ఖమ్మం జిల్లా ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని ఈ కొత్త రైల్వే లైన్ ఖమ్మం జిల్లాకు అవసరం లేదని తాను ఖరా ఖండిగా రైల్వే మంత్రికి, రైల్వే బోర్డు చైర్మన్ కు , జనరల్ మేనేజర్ కు స్పష్టం చేయడం జరిగిందన్నారు. ప్రజల అభీష్టమే తన అభిమతమని ప్రజలకు నష్టం జరిగే దేనిని సహించనని నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.