ఉపాధి హామీ నిధులతో బి.టి రోడ్లు, సిసి రోడ్లు, డ్రైనేజి ల అభివృద్ధి చేయడానికి ప్రతి మండలానికి 60 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ నిధులతో ఇదివరకే చేపట్టి నిధులు సరిపడక ఆగిపోయిన పనులను ముందుగా చేపట్టాలని తెలిపారు. అటువంటి పనులు పెండింగ్ లేని చోట కొత్త పనులకు ప్రతిపాదనలు పంపాలని అన్నారు.
ఇప్పటికే ఎస్.కోట, రాజాం తప్ప అన్ని నియోజక వర్గాల నుండి 60 లక్షలకు సంబంధించిన ప్రతిపాదనలు అందాయని విజయనగరం జిల్లా కలెక్టర్ తెలుపగా అందరి ఎమ్మెల్యే లతో మంత్రి బొత్స ఫోన్ ద్వారా మాట్లాడి పెండింగ్ పనులు ముందు పూర్తి చేయాలనీ, మిగిలిన నిధులకు కొత్త పనులకు ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఛాంబర్ లో మంత్రి బొత్స.. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తో కలసి పంచాయతి రాజ్ పనులు, భారీ వర్షాలు, గిరిజన యూనివర్శిటీ పనుల పై సమీక్షించారు.
ఉపాధి హామీ నిధులతో చేపట్టే 60 లక్షల పనులను వెంటనే మంజూరు అయ్యేలా చూడాలను డ్వామా పి.డి కి సూచించారు. ట్రైబల్ యూనివర్సిటీ కి సంబంధించి 519 ఎకరాలు మ్యుటేషన్ జరగవలసి ఉందని, మ్యుటేషన్ జరిగితే గానీ తదుపరి నిర్మాణ పనులు ప్రరంభించలేమని డీన్ శ్రీనివాస రావు తెలుపగా సోమవారం లోగా మ్యుటేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ కు మంత్రి బొత్స తెలిపారు.
యూనివర్సిటీ కి అప్రోచ్ రోడ్ కోసం ప్రతిపాదనలు పంపించగా ఈ.ఎన్.సి వద్ద పెండింగ్ ఉందని కలెక్టర్ తెలిపారు. మంత్రి పంచాయతి రాజ్ సెక్రటరీ తో ఫోన్ లో మాట్లాడి త్వరగా మంజూరు చేయాలనీ కోరారు. త్వరలో సీఎం జగన్ శంఖుస్థాపన చేస్తారని, యూనివర్సిటీ పనులకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని మంత్రి బొత్స అధికారులకు సూచించారు.
విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, పైప్ లైనింగ్ తదితర పనులు వేగంగా జరగాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం గానీ, జన నష్టం గానీ, ఇరిగేషన్ ట్యాంక్ ల గండ్లు గానీ జరిగాయా అని సంబంధిత అధికారులను మంత్రి బొత్స అడిగారు. సాధారణ వర్షపాతం కంటే 36 శాతం అధికంగా నమోదు అయ్యిందని, అయితే జిల్లాలో ఎక్కడా ఎలాంటి నష్టం వాటిల్లలేదని కలెక్టర్ తెలిపారు.
వర్షాలకు చెరువులన్నీ నిండి ఉంటాయి కావునా గండ్లు పడే అవకాశం ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశం లో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, డి.ఆర్.ఓ గణపతి రావు, సి,పి.ఓ బాలాజీ, పంచాయతి రాజ్, ఆర్.డబ్లూ.ఎస్. ఎస్ ఈ లు గుప్తా, ఉమా శంకర్, డ్వామా పి.డి. ఉమా పరమేశ్వరి, విద్యుత్ శాఖ ఎస్.ఈ లక్ష్మణ రావు, వ్యవసాయాదికారి తారక రామా రావు, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.