పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియపై చర్యలు చేపడుతున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అదనపు కలెక్టర్, వైరా తహసీల్దార్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు.
వైరా నియోజకవర్గంలో 252 పోలింగ్ కేంద్రాలు వున్నాయని, వీటిలో 7 కేంద్రాల స్థల మార్పుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. పోలింగ్ కేంద్రాల విషయమై సమస్యలు ఉంటే వెంటనే దృష్టికి తేవాలన్నారు. ఈవియంలపై ప్రతిఒక్కరికి స్పష్టమైన అవగాహన కల్పించే దిశగా మొబైల్, డిమాన్షేషన్ కేంద్రాల ద్వారా ప్రత్యక్షంగా అవగాహనను కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.
అర్హత గల ప్రతిఒక్కరు ఓటుహక్కు పొందేలా, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకొనేలా చైతన్యం తేవాలన్నారు. ఈ సమావేశంలో వైరా ఉప తహసీల్దార్ రాము, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.