వనపర్తి నియోజకవర్గానికి అదనంగా మరో 1500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. అదే విధంగా వనపర్తి జిల్లా అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తామని ఆయన వెల్లడించారు.
వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి పట్టణ పరిధిలో 500 గృహాలు, గ్రామీణ ప్రాంతానికి మరో వెయ్యి గృహాలు మొత్తం 1500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అదనంగా మంజూరు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో మాట్లాడి మంజూరు చేయిస్తానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఆదివారం ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలో సుమారు 95 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా మంత్రి అప్పాయిపల్లి సమీపంలో 8 కోట్ల 48లక్షల రూపాయల వ్యయంతో 160 గృహాలను నిర్మించగా మొదటవిడతన 24 గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు పత్రాలు అందజేశారు.
ఈ సందర్బంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేవలం మంత్రి నిరంజన్ రెడ్డి కారణంగానే వనపర్తి జిల్లాగా ఏర్పడిందని,వనపర్తి లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రిని అడిగిన తక్షణమే వనపర్తి జిల్లా కేంద్రంలో సెంట్రల్ లైటింగ్,రహదారుల విస్తరణకు తక్షణమే 50 కోట్ల రూపాయలను మంజూరు చేశారని మంత్రి వెల్లడించారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆపాయపల్లి, చిట్యాల ,పెద్దగూడెంలలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యిందని, మొదటి విడత అప్పాయిపల్లి లో నిర్మించిన 160 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 24 గృహాలను ఆదివారం లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందని, తక్కినవి కూడా రెండు రోజుల్లో కేటాయింపు చేస్తామని వెల్లడించారు.
వనపర్తి నియోజకవర్గానికి పట్టణ ప్రాంతంలో 500 ,గ్రామీణ ప్రాంతంలో వెయ్యి మొత్తం పదిహేను వందల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అదనంగా కేటాయించాలని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి గృహనిర్మాణ శాఖ మంత్రి తో విజ్ఞప్తి చేశారు.
ఇందుకు గృహనిర్మాణశాఖ మంత్రి సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే ముఖ్యమంత్రితో మాట్లాడి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు పోతుగంటి రాములు, జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్,వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మాజీ మునిసిపల్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్,
అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ,గ్రంథాలయ సంస్థ అధ్యక్ష్యుడు బోలేమోని లక్ష్మయ్య, ఎంపిపి కిచ్చా రెడ్డి,కౌన్సిలర్లు,అధికారులు ,ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి