బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో గల పెద్ద చెరువుకు బుంగ పడడంతో మత్స్యకారులు గమనించి గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు. దీంతో మండల ఉపాధ్యక్షులు రాజు పటేల్ నీటిపారుదల శాఖ అధికారి చందుకు సమాచారం ఇవ్వడంతో ఆయన చెరువు కట్టను పరిశీలించారు. అనంతరం గ్రామ పెద్దలు సొంత ఖర్చులతో జేసీబీ ఏర్పాటు చేసి ట్రాక్టర్లో మొరం వేసి బుంగను పూడ్చారు.
దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని మత్స్యకారులు అన్నారు. చెరువు కింద నాలుగు వందల నలభై ఏడు ఎకరాల ఆయకట్టు సాగు ఉంటుందని రైతులు తెలిపారు. నాలుగేళ్లలో నిండని చెరువు ఈసారి నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంటలు సాగు చేసుకోవడానికి ఈ పెద్ద చెరువు ఎంతగానో ఉపయోగపడుతుందని మండల ఉపాధ్యక్షులు రాజు పటేల్ అన్నారు.