రాష్ట్రంలో ఆటో, ట్రాన్స్పోర్టు కార్మికులపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ 21,31ని తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాధాకృష్ణ సాంబశివ, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎమ్మెస్ రాయుడు డిమాండ్ చేశారు
ఆటో వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ ఆటో డ్రైవర్స్ & వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ తో ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహన యజమానులతోపాటు ఆటో డ్రైవింగ్ లైసెన్సు ఉన్న ప్రతి కార్మికునికీ వాహన మిత్రను అమలు చేయాలన్నారు.వాహన మిత్రతో ఆటో కార్మికులకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. ఈ పథకానికి ఎక్కువ మంది ఆటో కార్మికులను అనర్హులను చేయాలనే ప్రభుత్వం కేవలం యజమానులకే ఇస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టసవరణతో మొత్తం ట్రాన్స్పోర్టు రంగమే సంక్షోభంలోకి పోయిందన్నారు. కేంద్రం తెచ్చిన చట్టసవరణతో రాష్ట్ర ప్రభుత్వం భారీ జరిమానాలకు జిఓలను జారీ చేసిందన్నారు. ఆటో కార్మికులకు పిఎఫ్, ఈయస్ఐ తో కూడిన ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు
రోజురోజుకూ ఆటో నడుపుకుంటున్న కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల మీద మోయలేని భారాన్ని మోపుతున్నదన్నారు
మున్సిపాలిటీ పంచాయతీలలో ఆటోలు నిలుపు కోవడానికి పార్కింగ్ స్థలాలను కేటాయించాలని,ఆటో డ్రైవర్లకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాజంపేట పట్టణ కార్యదర్శి సికిందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పంఢుగోల మణి,ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు నాగేశ్వరరావు, గంగయ్య,సుబ్బారాయుడు, చోటు,యల్లారెడ్డి,మస్తాన్,శీను, బ్రహ్మయ్య, సురేష్, వెంకటేష్, గంగాధర్, విజయ్ భాస్కర్, లక్ష్మి నారాయణ,ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు