ఏఎన్ఎంల సమ్మెకు బిఎస్పి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల మద్దతు
రెగ్యులరైజేషన్ కోసం ఈనెల 16 వ తేదీ నుంచి సెకండ్ ఏఎన్ఎంలు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం కి 17వ రోజుకు చేరుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ మున్సిపల్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో ఏఐటియుసి నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5200 మంది సెకండ్ ఏఎన్ఎంలు ఏఐటియుసి ఆద్వర్యంలో ఉద్యోగ భద్రతకై రెగ్యులరైజేషన్ కోసం నిరవధిక సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని అన్నారు.
ప్రజారోగ్యం పట్ల, ఏఎన్ఎం ల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నదని, పైగా 16 18 సంవత్సరాలనుంచి వెట్టి చాకిరి చేస్తున్న ఏఎన్ఎంలు తమ హక్కులకై పోరాడుతుంటే ప్రభుత్వం నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న ఏఎన్ఎంల ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నదని కొండన్న ఆరోపించారు. పోరాటాలకు పురిటిగడ్డ అయిన తెలంగాణ గడ్డమీద పుట్టిన ఆడబిడ్డలైన ఏఎన్ఎంలు తాటాకు చప్పుళ్ళకు ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోరని కొండన్న పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏఎన్ఎంల పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడి బేషరతుగా 5200 మందిని రెగ్యులరైజ్ చేయాలని కొండన్న డిమాండ్ చేశారు. 17వ రోజు ఏఐటియుసి ఆధ్వర్యంలో జరుగుతున్న ఏఎన్ఎంల సమ్మె కు బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి, గంగుల కృష్ణారెడ్డి, రాఘవేందర్ మద్దతుగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర సెకండ్ ఏఎన్ఎం యూనియన్ నాయకులు శోభ, స్వరూప, మంజుల, వెంకటేశ్వరమ్మ, చంద్రకళ, శారద, భారతి, సుజాత, సునీత, అనసూయ, లక్ష్మి, మహేశ్వరి, దేవిక, సుమలత, సుధారాణి, శోభారాణి, శ్రీదేవి, అలవేలు, మునెమ్మ, శివలీల తదితరులు పాల్గొన్నారు.