ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా విజయనగరం లో స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యుత్తు శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఉజ్వల భారత్.. ఉజ్వల భవిష్యత్తు వేడుకలు మహోజ్వలంగా జరిగాయి. విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచుతూ… భవిష్యత్తుపై బాధ్యతను తెలియజేస్తూ స్ఫూర్తిదాయకంగా సాగాయి.
వినియోగదారులను ఆలోచింపజేసేలా… ఆకట్టుకునేలా నిర్వహించిన వివిధ ప్రదర్శనలు విశేషంగా నిలిచాయి. భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే వివిధ రకాల విద్యుత్తు ఉపకరణాలను వివిధ సంస్థలు ప్రదర్శనలో ఉంచాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్తు ఉత్సవాలు.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. విజ్ఞానాత్మకంగా సాగాయి. కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, నోడల్ అధికారి పి. ఆనంద్ బాబు తమ అమూల్యమైన సందేశాలను ఇచ్చారు. విద్యుత్తు వినియోగంలో అందరూ ఆచితూచి వ్యవహరించాలి.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని పేర్కొన్నారు.
విద్యుత్తు ఉత్పత్తికి.. వినియోగానికి మధ్య అంతరాన్ని తగ్గించాలి
దేశంలోని వివిధ రంగాల ప్రగతిని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఆజాది కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తోందని.. దానిలో భాగంగానే మనందరం ఈ రోజు విద్యుత్ ఉత్సవాలను జరుపుకుంటున్నామని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గుర్తు చేశారు. 2047 నాటికి దేశంలో సంపూర్ణ విద్యుత్తు సరఫరా అందుబాటులో ఉంచాలంటే విద్యుత్తు ఉత్పత్తికి.. వినియోగానికి మధ్య అంతరం తగ్గించాలని పేర్కొన్నారు.
గృహ వినియోగానికి ఏ మేరకు విద్యుత్తు సరఫరా చేస్తున్నామో… పారిశ్రామిక అవసరాలకు కూడా అంతే మోతాదులో సరఫరా చేయగలిగే స్థితికి చేరుకోవాలన్నారు. రాబోయే 25 సంవత్సరాల్లో 100 శాతం విద్యుదీకరణ.. ఉత్పత్తి దిశగా చేరుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునురుత్పాదక విద్యుత్తు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉజ్వల భారత్.. ఉజ్వల భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునేందుకు విద్యత్తు శాఖ అధికారులు, వినియోగదారులు బాధ్యతాయుతమైన కృషి చేయాల్సి ఉందని జేడ్పీ ఛైర్మన్ పేర్కొన్నారు. ప్రజా అవసరాలను తీరుస్తూ.. ఆర్థిక ప్రగతి సాధించే దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఉద్ఘాటించారు.