మార్చి 19 నుండి నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై విద్య, రెవెన్యూ, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ తదితర శాఖలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలను సాఫీగా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతం చేయాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు.
పరీక్ష జరిగే సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను, అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని ఎస్పీని, పరీక్షా కేంద్రాల వద్ద ఒక హెల్త్ అసిస్టెంట్, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ల, మందులను ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని, పరీక్ష రాసే పిల్లలకు తాగేందుకు మినరల్ వాటర్ ఉంచాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయాలన్నారు.
పరీక్షా సమయంలో 144 సెక్షన్ అమలు చేయాలని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షా కేంద్రాలలో మొబైల్ ఫోన్లు అనుమతి లేదని తెలిపారు. జిల్లా విద్య శాఖ అధికారి టి.ప్రణీత మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 19 నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం 12:15/12.45 వరకు నిర్వహిస్తారు.
జిల్లాలో 45 రెగ్యులర్, ఒకటి(1) ప్రైవేట్ కేంద్రాల్లో 9799 రెగ్యులర్ విద్యార్థులు, 225 ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఆమె తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి ఎం సి అలెగ్జాండర్, ఎలక్ట్రిసిటీ యస్.ఈ. చౌహన్, ఆర్ డి ఓ లు ప్రసూనాంబ, రాజు, డిపిఆర్ఓ అబ్దుల్ కరీం, కలెక్టరేట్ పరిపాలనాధికారి కరీం, ఆర్టీసీ, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.