నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, డి.ఆర్.డి.ఏ, సఖి, డిపిఓ,పంచాయతి రాజ్ తదితర శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ సెంటర్లలో మౌళిక సదుపాయాల కల్పనకు డిపిఓ, డిఆర్డీఏ, పంచాయతి రాజ్ శాఖలు సహకరించాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూర్చోడానికి సిమెంట్ బల్లలు అమార్చే ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని, 15 రోజుల్లో పూర్తి చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా డిపిఓ ను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
అదేవిధంగా అన్ని కేంద్రాల్లో న్యూట్రీగార్డెన్లు ఏర్పాటు చేయాలని, స్థలం లేకుంటే ఎక్కడ స్థలం దొరికితే అక్కడ పెట్టాలని ఆదేశించారు. దీనికొఱకు పంచాయతి సెక్రెటరీలు స్థలం, నాణ్యమైన మట్టి పోయించడం వంటి సహకారం అందించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా అవసరమైన కేంద్రాల్లో కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఏర్పాటు వంటివి చేయాలని డిఆర్డీఏ అధికారిని ఆదేశించారు.
అన్ని మౌలిక సదుపాయాల స్థితుగతులు, సమస్యల పై ఎప్పటి కప్పుడు సమాచారం అందేవిధంగా గూగుల్ ఫార్మ్ ఏర్పాటు చేసి అందులో నివేదికలు పెట్టేవిధంగా చూడాలని ఈ.డి.యం ను ఆదేశించారు. ప్రతి ప్రీస్కూల్ పిల్లలను ప్రాథమిక పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.
ఎత్తుకు తగ్గ బరువు స్యామ్ మ్యామ్ పిల్లలు అందరూ సాధారణ స్థితికి వచ్చే విధంగా సూపర్వైజరి ఫీడింగ్ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటి వరకు చేసిన కార్యాచరణ మొత్తం ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసి ఇవ్వాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారిణి టి.యు. వెంకటలక్ష్మి, పి.ఓ ఐ.టి.డీ ఏ అశోక్, డీపీఓ కృష్ణ, డిఆర్డీఓ నర్సింగ్ రావు, మున్సిపల్ కమిషనర్ నగేష్, సి.డి.పిఓ లు, సఖి సెంటర్ సునీత, తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యం న్యూస్. నెట్, నాగర్ కర్నూలు