భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాసితుల కోసం నిర్మించనున్న కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జే.సీ కిషోర్ కుమార్ తెలిపారు. నిర్వాసితుల కోసం, గూడెపువలస వద్ద ప్రతిపాదించిన ఆర్అండ్ఆర్ కాలనీలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా, బొల్లింకలపాలెం కి చెందిన ఇళ్లు కోల్పోయిన 55 మంది నిర్వాసితుల స్థలాలకు జే.సీ, ఆర్డీఓలు భూమిపూజ చేశారు. నిర్వాసితులకు ఇంటి నిర్మాణానికి, ఒక్కొక్కరికీ 5 సెంట్లు చొప్పున స్థలాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ, నిర్వాసితులకు ఇంటి నిర్మాణానికి, ఆర్అండ్ఆర్ కాలనీల్లో స్థలాలు కేటాయించామని లబ్ధిదారుల స్వయంగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు.
ఒక్కొక్క ఇంటికి రూ. 9 లక్షల 20 వేలను, ఆర్ఆర్ ప్యాకేజీ కింద కేటాయించామని చెప్పారు. కాలనీలో రోడ్లు, కాలువలు, విద్యుత్, త్రాగునీరు తదితర అన్నిరకాల మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. అనంతరం ఆర్డోఓ బిహెచ్. భవాని శంకర్ మాట్లాడుతూ, లబ్ధిదారులకు నిధులను, నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
లబ్ధిదారులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా, నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం పోలిపల్లి ఆర్అండ్ఆర్ లేఅవుట్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమణమ్మ, వైఎస్సార్ పార్టీ మండల కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, గూడెపు వలస సర్పంచ్ అయ్యప్ప రామకృష్ణా రెడ్డి, ఎయిర్ పోర్ట్ అథారిటీ భూసేకరణ సమన్వయాధికారి జి.అప్పలనాయుడు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.