విజయనగరం ఆర్టీసి కాంప్లెక్స్ ఆటో స్టాండు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్ఐ లోవరాజు హెచ్చరించారు. ఈ మేరకు ట్రాఫిక్ డిఎస్పీ డి.విశ్వనాధ్ ఆదేశాలతో ఆటో యూనియన్, ఆటో డ్రైవర్లుతో ట్రాఫిక్ ఎస్ఐ లోవరాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ లోవరాజు మాట్లాడుతూ – ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద ఆటోలను అడ్డంగా నిలిపి వేయడం వలన ఇతర వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, క్రమపద్దతిలో ఆటోలు నిలపాలన్నారు. సీరియల్ ప్రకారం ఆటోలను స్టాండులో ఉంచాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినా, అస్తవ్యస్తంగా ఆటోలు నిలిపినా చర్యలు తప్పవని ఆటో డ్రైవర్లను ఎస్ఐ లోవరాజు హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించే విధంగా యూనియన్ సభ్యులు చూడాలన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆటో డ్రైవర్లను హెచ్చరించామని, కానీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. ఇకపై ఎవరైనా కాంప్లెక్స్ గేటులు వద్ద అస్తవ్యస్తంగా ఆటోలు నిలిపితే తగిన చర్యలు చేపట్టి, కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ లోవరాజు తెలిపారు.