అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి సీబీఐ కోర్టుకు హాజరు కావడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ తరపు న్యాయవాదులు కోరారు. ఈ కేసుల్లో ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసు విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు పేర్కొంది.
జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఆర్థికపరమైన కేసుల్లో ఉన్న నిందితులకు మినహాయింపు ఇవ్వొదని సీబీఐ కోరింది. జగన్ కు మినహాయింపు ఇస్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని, మినహాయింపు ఇవ్వకుండా విచారణకు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పై ఏప్రిల్ 9న వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.