కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ముఖ్య సమావేశం సోమవారం మండల కేంద్రంలోని బండయప్ప కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్బంగా హైదరాబాదులో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనే బహిరంగ సభకు కార్యకర్తల సమీకరణ భారీ స్థాయిలో ఉండాలని భాజపా జిల్లా అధ్యక్షురాలు మాజీ శాసన సభ్యురాలు అరుణ తార అన్నారు.
అనంతరం జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జ్ పటాన్చెరు మాజీ శాసనసభ్యులు నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భాజపా జెండా ఎగురవేయడం ఖాయమని అందుకు గాను కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న నిధులు ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు.
తెలంగాణ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఇదే అదునుగా ప్రతీ కార్యకర్త తెరాస వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆరు మండలాల బూత్ స్థాయి ,మండల స్థాయి శక్తి ప్రోగ్రామ్ నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం అయ్యారు.
సమావేశ అనంతరం భాజపా శ్రేణులు బిచ్కుంద వీధుల్లో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఇంచార్జీలతోపాటు బిచ్కుంద మఠాధిపతి శ్రీ సోమలింగా శివాచార్య స్వామిజి, అధ్యక్షుడు కిష్టారెడ్డి, నాయకులు శ్రీధర్ పంతులు, ప్రధాన కార్యదర్శి పత్తి రమేష్,బీజేవైఎం నాయకులు విష్ణు,సందీప్, పండరి,పుల్కల్ సాయిలు,ఆయా మండలాల భాజపా మండల అధ్యక్షులు ఆయా విభాగాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జి. లాలయ్య సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం