ఉపాధిహామీ పథకం అమలు లక్ష్యాలను జిల్లాలో వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎంపిడివో లతో ఉపాధిహామీ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 589 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 3,22,315 క్రియాశీలక ఉపాధి హామీ కూలీలున్నట్లు ఆయన అన్నారు. తగినన్ని మ్యాన్ డేస్, పనులు ఉన్నాయా చూసుకోవాలన్నారు. ప్రతి మండలంలో 30 వేల లేబర్ టర్నోవర్ జరగాలన్నారు. అధికారులు ఉదయం 7 గంటలకల్లా క్షేత్ర స్థాయిలో ఉండాలని, లేబర్ సమీకరణ, పనులు జరిగేట్లు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. డిసిసి మెటీరియల్ కాంపోనెంట్ క్రింద సిసి రోడ్లకు 3,058 లక్షలు, గ్రామ పంచాయతీ భవనాలకు 2,140 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన అన్నారు. నర్సరీల్లో డిమాండ్ ఉన్న మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
జిల్లాలో 3,21,336 మంది వర్కర్లకు గాను 3,20,424 మందికి ఆధార్ సీడింగ్ పూర్తి చేసినట్లు, మిగిలిన వారికి ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సోషల్ ఆడిట్ క్రింద 132 పేరాలకు గాను రూ. 5,47,239 లు రికవరికి గాను రూ. 81,545 లు ఇప్పటి వరకు చేసినట్లు, మిగిలిన మొత్తం రికవరికి చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం గిరి వికాసం క్రింద రూ. 877.58 లక్షలు మంజూరు కాగా, రూ. 690.50 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, డిఆర్డీఓ విద్యాచందన, జెడ్పి సిఇఓ వివి. అప్పారావు, పీఆర్ ఇఇ కెవికె. శ్రీనివాస్, అదనపు డిఆర్డీఓ శిరీష, డివిజన్ పంచాయతీ అధికారులు పుల్లారావు, ప్రభాకర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.