ఎటువంటి అసమానతలు లేని సమ సమాజాన్ని స్థాపించడమే, భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ధ్యేయమని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన స్ఫూర్తిని సాధించేందుకు ప్రతీఒక్కరూ అంకితం కావాలని బొత్స పిలుపునిచ్చారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతోత్సవం నేపధ్యంలో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా విజయనగరంకు వచ్చారు… మంత్రి బొత్స..స్థానిక బాలాజీ జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ ఎ.సూర్యకుమారి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, దళిత సంఘాల నాయకులు ముందుగా పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
అనంతరం ఆనందగజపతి ఆడిటోరియంలో, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జయంతి సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశానికి ఒక రక్షణ కవచమని పేర్కొన్నారు. ఎంతో పకడ్భంధీగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గొప్ప మేధావి అని కొనియాడారు. . ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అంబేద్కర్ మార్గం అనుసరణీయమని అన్నారు. .
తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అట్టడుగు వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. విద్యద్వారానే అంబేద్కర్ మహనీయునిగా ఎదిగారని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని, విద్యార్థులంతా బాగా చదువుకొని వృద్దిలోకి రావాలని కోరారు. నగరంలోని అంబేద్కర్ భవనాన్ని పునరుద్దరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.