నిరసనగా అంబేడ్కర్ జయంతి వేడుకల బహిష్కరణ
మహనీయుల జయంతుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ప్రభుత్వ యంత్రాంగం పాల్గొనకుండా భారత రాజ్యంగ నిర్మాతను అవమానించారాని ఉత్సవ కమిటీ అధ్యక్షులు కోళ్ల శివ తెలిపారు. తక్షణమే జిల్లా యంత్రాంగం బహుజనులకు, దళితులకు, జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహిస్తూ, జీతాలు తీసుకుంటూ అధికార యంత్రాంగం ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు.
దేశ మాజీ ఉప ప్రధాని జగజీవన్ రామ్ జయంతి రోజున కూడా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఇలాగే వ్యవహరించారని ఆయన అన్నారు. జిల్లాలో దళిత కలెక్టర్ ఉండి కూడా ఇలా చేయడం సమంజసం కాదని అన్నారు. అట్లాగే అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, స్థానిక జడ్పీ చైర్ పర్సన్ లు కూడా కార్యక్రమానికి హాజరు కాకపోవడం కూడా దళిత, బహుజనులపై వివక్ష చూపడమే అన్నారు.
ప్రభుత్వం అధికారికంగా జరిపే కార్యక్రమం లో కూడా అధికారులు విస్మరించడం అంటే వారి వైఖరి ఏమిటో స్పష్టంగా అర్ధం అవుతుంది. ప్రభుత్వం అధికారిక కార్యక్రమాన్ని విస్మరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహనీయుల జయంతుల ఉత్సవ కమిటీ జెట్టి ధర్మరాజ్, వార్డెన్ చెన్నయ్య, గుడ్లనర్వ రాంచందర్, గూట విజయ్, గడ్డం విజయ్, అంతటి కాషాన్న, జెట్టి వెంకటేష్, భాను ప్రకాష్, పృథ్వీ రాజ్, వంగూరి జయశంకర్, హుస్సేన్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.