అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పై అన్ని హక్కులు తమకే ఉన్నాయని, త్వరలో స్థానిక జర్నలిస్టులతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని సీనియర్ జర్నలిస్టులు సతీష్ ముదిరాజ్, డిఎస్ హన్స్ రాజ్ నాథ్ , సయ్యద్ గౌస్ పాషా, బీవీ శేఖర్ లు తెలిపారు. గురువారం అంబర్ పేటలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ అంబర్ పేట నియోజకవర్గంలో పని చేస్తే స్థానిక జర్నలిస్టుల సంక్షేమం కోసం 2009లో అప్పటి జర్నలిస్టులు అంతా కలిసి అసోసియేషన్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాలక్రమైనా కొంతమంది అసోసియేషన్ లో గుత్తాధిపత్యం చెలాయిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తూ స్థానిక జర్నలిస్టుల సంక్షేమాన్ని గాలికి వదిలి వేశా రని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అసోసియేషన్ లో స్టాఫ్ రిపోర్టర్లను, వేరే నియోజకవర్గాలకు చెందిన రిపోర్టర్లను సభ్యులుగా తీసుకొని స్థానిక విలేకరులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఏడాది డైరీ యాడ్స్ ద్వారా సేకరిస్తున్న నిధులను దుర్వినియోగం చేశారని, వడ్డీకి అప్పులు ఇస్తున్నారని వారు ఆరోపించారు.
అసోసియేషన్ లో జరుగుతున్న అవకతవకలను, అక్రమాలను తాము ప్రశ్నిస్తే తమపై గౌరవ సభ్యులు అనే ముద్ర వేసి దూరం పెట్టారని పేర్కొన్నారు. తమకు జరిగిన అన్యాయంపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, కోశాధికారికి లీగల్ నోటీసులు పంపించామని తెలిపారు. అలాగే అసోసియేషన్ కు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. అంబర్ పేట నియోజకవర్గంలో పని చేస్తున్న స్థానిక విలేకరుల సంక్షేమమే లక్ష్యంగా అసోసియేషన్ పని చేస్తుందని వారు తెలిపారు.
సత్యం న్యూస్, అంబర్పేట్