పశువులు తదితర మూగ జీవాల ప్రాణాల పరిరక్షణకోసం, డాక్టర్ వైఎస్ఆర్ పశు ఆరోగ్యసేవను రాష్ట్ర సీఎం జగన్ ప్రవేశపెట్టారని విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రజల ప్రాణాల రక్షణకోసం 108 అంబులెన్సు సేవలను నిర్వహిస్తున్నట్లే, పశువుల కోసం 1962 నెంబర్ తో పశువైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు.
మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికీ ఒకటి చొప్పున అంబులెన్సులను ఇచ్చారని, రెండో విడతలో మరో వాహనం రానుందని తెలిపారు. దేశంలో పాడి పరిశ్రమ వృద్దికి, రైతు సంక్షేమానికి ప్రవేశపెట్టిన ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
డాక్టర్ వైఎస్ఆర్ పశు ఆరోగ్యసేవలో భాగంగా జిల్లాకు మంజూరైన 7 అంబులెన్సులను, విజయనగరం జిల్లా పరిషత్ ప్రాంగణం వద్ద ఛైర్పర్సన్ ప్రారంభించారు. వాహనంలోని లేబరేటరీ, హైడ్రాలిక్ లిఫ్టులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ నిర్ణయం విప్లవాత్మకమని పేర్కొన్నారు.
సుమారు 145కోట్లతో మొదటి విడత 175 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాకు 7 వాహనాలను కేటాయించిందని చెప్పారు. ఆనారోగ్యానికి గురైన పశువులకు, అవి ఉండే ప్రదేశంలోనే మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ఈ వాహనాలు దోహదపడతాయని అన్నారు.
అవసరమైన పరీక్షలను నిర్వహించేందుకు ఆధునిక లేబరేటరీ సౌకర్యాన్ని కూడా అంబులెన్సులో కల్పించినట్లు చెప్పారు. అవసరమైతే, పశువులను అక్కడినుంచి ఆసుపత్రులకు తరలించేందుకు అనువైన ఏర్పాట్లుకూడా ఈ వాహనంలో ఉన్నాయన్నారు.
ఆపదసమయంలో పశువుల విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఈ వాహనాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అవసరమైనవారు 1962 నెంబరుకు ఫోన్ చేసి, ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ వృద్దికి, తద్వారా పాల ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు.
పెంపుడు జంతువులు, పశువులు, మేకలు, గొర్రెలు లాంటి మూగజీవాల ప్రాణాల పరిరక్షణకు ముందుకు రావడం, సీఎం జగన్ గొప్ప మనసుకు నిదర్శనమని ఛైర్పర్సన్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్సి గాదె శ్రీనువాసులనాయుడు, జెడ్పి సిఇఓ రాజ్కుమార్, పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వైవి రమణ, పలువురు పశు వైద్యాధికారులు, జివికెఇఎంఆర్ఐ జిల్లా సమన్వయకర్త బి.నారాయణరావు, సిబ్బంది పాల్గొన్నారు.