కల్వకుర్తి నంద్యాల జాతీయ రహదారి 167 లో దళితుల భూములు కోల్పోతున్నారని అందువల్ల దాని ఎలైన్ మెంట్ మార్చాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంబల సుధాకర్ తో కలిసి నేడు ఆయన కల్వకుర్తిలో కోల్పోతున్న దళితుల భూములను పరిశీలించారు.
అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తాలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కల్వకుర్తి నంద్యాల జాతీయ రహదారి ఎలైన్ మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో ఇన్చార్జ్ అధికారిని పుష్పలత కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య మాట్లాడుతూ కల్వకుర్తి, తాడూరు ప్రాంతాల్లో 40 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
167 జాతీయ రహదారి లో దళితులకు ఉన్న అర్థ ఎకరా, ఒక్క ఎకరం, రెండెకరాలు ఉన్న దళితులు జాతీయ రహదారులు భూములు కోల్పోతున్నారని అన్నారు. గతంలో కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లో వందల ఎకరాలు దళితుల భూములు తీసుకున్నారని గుర్తు చేశారు.
ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేపట్టిన దళితుల భూములు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. దళితుల భూములు తీసుకుంటే భూమి మీద జీవనోపాధి ఉన్న దళితులు ఉపాధి అవకాశాలు కోల్పోతారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని డిజైన్ మార్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళితులంతా వాళ్ళ ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి కల్వకుర్తి నంద్యాల జాతీయ రహదారి డిజైన్ మార్చి దళితుల బతుకుల్లో వెలుగులు నింపాలని అన్నారు. లేనిపక్షంలో తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో అన్ని దళిత సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మంది పలుకుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంబల సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ బంగారయ్య, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, కల్వకుర్తి డివిజన్ అధ్యక్షులు నీరడీ మహేష్, వంగూర్ మండల అధ్యక్షుడు దొడ్డి విష్ణు, జిల్లా కార్యదర్శి కాడం రాఘవేందర్, జిల్లా సహాయ కార్యదర్శి బ్యాగరి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు పాశం రాకేష్, జిల్లా నాయకులు సాతర్ల పెంటయ్య, కాడం కథలయ్య, బుద్ధమల్ల దేవేందర్ కాలే సైదులు తదితరులు పాల్గొన్నారు.