దూసుకుపోతున్న దేశ ఆర్థిక ప్రగతికి కరోనా మహమ్మారి ప్రభావంతో కళ్లెం పడిందని లేకుంటే వచ్చే 7,8 ఏళ్ళలో భారతదేశం ప్రపంచస్థాయి లో 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపాంతరం చెందేదని ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ అన్నారు.
కరోనా పుట్టుక, వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ వేదికపై చైనాను దోషిగా నిలబెట్టాలని అమెరికా ఇప్పటికీ ప్రయత్నిస్తూనేఉంది. కానీ యూరోపియన్ యూనియన్ తో చైనాకు ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య, వ్యాపార సంబంధాల దృష్ట్యా అమెరికా వాదనకు ఆశించిన స్థాయిలో మద్దతు చేకూరలేదు.
చైనాతో తెగతెంపులు సాధ్యం కాదేమో
పరస్పరం దీర్ఘకాలిక ప్రయోజనాలు కాంక్షించి చేసుకున్న ఒప్పందాలు, ఒడంబడికలు ఒక్కసారిగా వదిలించుకోవటం కుదరని వ్యవహారం. భారత్ విషయానికి వస్తే చైనాతో ఎప్పటినుంచో ఉన్న సరిహద్దు సమస్యలు ఒక్కోసారి ఉద్రిక్తత తలకు దారితీస్తున్నా చైనాతో తెగతెంపులు చేసుకోవడం అసాధ్యం.
చైనాకు చెందిన 59 యాప్స్ నిషేధం వంటి విషయాలలో భారత్ కఠినంగా వ్యవహరించింది. అయినా భారత్ కు కావలసిన సాంకేతిక సహకారం, ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకుల దిగుమతి విషయంలో తొందరపడే అవకాశాలు లేవు.
కరోనాతో అతలాకుతలమైన ఆర్ధికం
మిగిలిన దేశాలతోపాటు చైనాకు చెందిన ప్రత్యక్ష లేదా పరోక్ష పెట్టుబడులు భారత్ లో లక్షల కోట్ల విలువలో ఉన్నాయి. ఫార్మా, ఏవియేషన్, రక్షణ శాఖ అనుబంధ పరిశ్రమలు, ఆతిథ్యరంగం తదితర రంగాలు విదేశీపెట్టుబడుల ప్రభావం ఉంది. కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక దుస్థితిని మెరుగుపరచే ఉద్దేశంతో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల స్వీకరణను భారత్ కఠినతరం చేసింది.
ఇకపై కేంద్రప్రభుత్వం అనుమతి లేకుండా దేశంలో విదేశీపెట్టుబడులు అనుమతించేది లేదని ఆదేశాలు జారీచేసింది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లో చైనా కేంద్ర పెట్టుబడులు 1.01 శాతానికి పెరగడంతో ప్రభుత్వానికి చెందిన డిపిఐఐటీ ఒక ప్రకటన విడుదల చేసింది.
భారత్ ఇరుగుపొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్, పాకిస్తాన్ తదితర దేశాలు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో విదేశీ పెట్టుబడి దారులు ఆర్ధికంగా లాభం పొందకూడదనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
భారత్ కు వచ్చేస్తున్న చైనా శత్రువులు
చైనాతో వైరం కారణంగా భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్ లతో సహా చాలా దేశాలు ముందుకొస్తున్నాయి. అమెరికా కూడా కొన్ని దేశాలకు భారత్ లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తోంది. అమెరికాకు చెందిన 1000కి పైగా కంపెనీలు భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ పత్రిక వెల్లడించింది.
ఈ నేపథ్యంలో భారత్ లో విదేశీ పెట్టుబడులకు అవసర మైన మౌలిక సదుపాయాలు, అనుమతి ఇచ్చే అధీకృత కేంద్రాలు, ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహకారం విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆర్ధిక వ్యవస్థ తిరిగి పట్టాలకెక్కడానికి 2,3 ఏళ్ళ సమయం పట్టవచ్చని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. వృద్ధిరేటు 7-8 శాతానికి చేరువకాడానికి ప్రభుత్వం గుణాత్మక, నిర్మాణాత్మక చర్యలు చేపట్టి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్ళాలని వారు సూచిస్తున్నారు.
ఆశావహంగా మారుతున్న ఆర్ధిక పరిస్థితి
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ ఎమ్ ఎఫ్) సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది. ప్రపంచ వృద్ధిరేటు కేవలం 4.9 శాతంగా నమోదైన నేటి పరిస్థితులలో భారత్ వేగంగా పుంజుకునే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ వాణిజ్య శాస్త్రవేత్తలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా విలయం నుంచి త్వరగా కోలుకున్న చైనాలో జీడీపీ కేవలం 1.49 శాతం దగ్గరే ఆగిపోవడానికి ప్రపంచదేశాలలో అధికశాతం వాటి పెట్టుబడులు ఉపసంహరించడమేనని విశ్లేషిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా పంథాను కొనసాగిస్తూనే ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు రాబట్టేందుకు నిబంధనలు సరళతరం చేయాలంటున్న ఆర్థికరంగ ప్రముఖులు సలహా ఆచరణీయం.
-పొలమరశెట్టి కృష్ణారావు