వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వ్యవస్థలు చేస్తున్న హత్యలకు బడుగులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనం నేరం మోపి పోలీసులు వేధించడంతో నంద్యాలలో చిన్నబాబు అనే దళిత యువకుడు ప్రాణాలు తీసుకోవడం అత్యంత బాధాకరం అన్నారు.
ఏ పోలీసులు అయితే వేధిస్తున్నారని 2020 నవంబర్లో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందో… అదే పోలీస్ స్టేషన్ అధికారుల వేధింపుల కారణంగా నేడు చిన్న బాబు రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవడం విషాదకరం అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
రక్షణ ఇవ్వాల్సిన పోలీసుల వల్లనే ప్రాణాలు పోయే పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారు అని మండిపడ్డారు. నంద్యాల ఘటనలో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేయాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.