నారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రోజు రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు దారిపొడవునా రెండు గంటలపాటు అంగన్వాడీ టీచర్ల ను బానిసల్లా నిలబెట్టారని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జి వెంకట్రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి బాల్ రామ్ అన్నారు.
అంగన్వాడి లతో ఈ పని చేయించడం తెలంగాణలో నిజాం పరిపాలనలో బానిస బతుకు ఎలా ఉంటుందో అన్న చిత్రం కళ్లముందు కదలాడే చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నారాయణపేట, కోసిగి ప్రాజెక్టుల పరిధిలోని పని చేస్తున్న 500 మంది అంగన్వాడి టీచర్ లను మొక్క చేత పట్టించి రెండు చేతులు పైకి పెట్టించి కేటీఆర్ కి మొక్కాలని ఐసిడిఎస్ అధికారులు ఆదేశించడంతో దారి పొడవునా అంగన్వాడీలు అవమానాలకు ఓర్చుకొని బానిసలా కిమ్మనకుండా మొక్కతో మంత్రి తారకరామారావు గారికి మొక్కి పోక తప్పలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న అంగన్వాడి టీచర్ లను ఈ రకంగా రోడ్డు పొడవునా నిలబెట్టి అవమాన పరచడం అన్యాయమని విమర్శించారు. ఉదయం 7 గంటలకే తమ ప్రాంతాల నుండి దాదాపుగా 150 రూపాయలు ప్రయాణపు ఖర్చులు భరించి ఉపవాసంతో వచ్చి అరకిలో బరువు ఉన్న మొక్కతో మంత్రి తారకరామారావు గారికి వందన సమర్పణం చేశారని అన్నారు .
ఈ చర్యకు పాల్పడిన ఐసీడీఎస్ జిల్లా పీడీ పై ప్రభుత్వం చర్య తీసుకోవాలని వ్యయప్రయాసలకు ఓర్చుకోని వచ్చిన అంగన్వాడీలకు ప్రయాణ ఖర్చులు, టిఫిన్లు భోజనాలు ఖర్చులు అందజేసి భేషరతుగా అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు