ఉక్రెయిన్ లో చిక్కుకున్న మరో భారతీయ విద్యార్థి బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరి 24న ఉక్రేయిన్ పై రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత ప్రాణాలు కోల్పోయిన మొదటి విద్యార్థి కర్ణాటకకు చెందిన నవీన్ అనే సంగతి తెలిసిందే. భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రేయిన్ నుంచి భారతీయ విద్యార్థులను స్వదేశంకు తరలించడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక వంక ప్రయత్నం చేస్తుండగానే అక్కడ పంజాబ్ లోని బార్నాలకు చెందిన చందన్ జిందాల్ (22) ప్రాణాలు కోల్పోయాడు.
అతను వినిట్సియాలోని నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఇషెమిక్ స్ట్రోక్తో బాధపడుతున్న జిందాల్ను వినిట్సియాలోని కీవ్స్కా వీథి-68లో ఉన్న ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు. ఆయన తండ్రి భారత ప్రభుత్వానికి రాసిన లేఖలో తమ కుమారుని మృతదేహాన్ని రప్పించేందుకు సాయం చేయాలని కోరారు. కర్ణాటకకు చెందిన నవీన్ శేఖరప్ప మంగళవారం ఉక్రెయిన్లోని ఖార్కివ్లో జరిగిన పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతదేహాన్ని రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఉక్రెయిన్ గగనతలంలో ప్రయాణికుల విమానాల రాకపోకలపై నిషేధం అమలవుతోంది. కాబట్టి మృతదేహాలను తీసుకురావడానికి ఇతర మార్గాలను అన్వేషించవలసి ఉంటుంది. ఇషెమిక్ స్ట్రోక్ వచ్చినపుడు మెదడుకు ఆక్సిజన్, న్యూట్రియెంట్స్ సక్రమంగా అందవు. క్షణాల్లోనే బ్రెయిన్ సెల్స్ మరణిస్తాయి. దీనికి సరైన, అత్యవసర చికిత్స తప్పనిసరి. సాధ్యమైనంత త్వరగా చికిత్స అందితే మెదడుకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు.