పీఆర్సీ విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎన్జీవో సంఘం నేత, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబును ఆంధ్రప్రదేశ్ సీఐడి పోలీసులు అర్ధ రాత్రి వేళ అరెస్ట్ చేశారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్షగట్టిందని, అరెస్టు చేసిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లిస్తుందని ఆయన అన్నారు. అశోక్ బాబు పై గతంలో 477 (A ), 466, 467, 468, 471,465,420, R/w34 IPC సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు సర్వీస్ లో ఉన్న సమయంలో పదోన్నతి కోసం విద్యార్హతను తప్పుగా చూపించారన్న కారణంగా ఈ కేసులు నమోదు అయ్యాయి. గురువారం రాత్రి 11.15 నిముషాలకు అశోక్ బాబు ఇంటి వద్దకు చేరుకున్న సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
అశోక్ బాబు ను అర్థరాత్రి దొంగల్లా వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అబద్దపు పునాదుల మీద అధికారాన్ని చేపట్టిన జగన్ రెడ్డి.. అరాచకంతో పాలన సాగిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ వైఫల్యాలు, తప్పుల్ని పశ్నించిన టీడీపీ నేతల్ని అక్రమ కేసులు, అర్దరాత్రి అరెస్టులతో వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు చేసిన మోసం, అన్యాయంపై ఉద్యోగుల్ని చైతన్యవంతం చేస్తున్నాడన్న కడుపుమంటతోనే ఆయనపై కక్ష సాధిస్తున్నారని అచ్చెన్న అన్నారు. అక్రమ కేసులకు భయపడేవారెవరూ టీడీపీలో లేరని, అశోక్ బాబును వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద కు తెలుగుదేశం నాయకులు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో అక్కడకు వచ్చిన దేవినేని ఉమతోపాటు టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, సుఖవాసి, అశోక్ బాబు సోదరుడు పరుచూరి శ్రీనివాసరావు, కనపర్తిలను పోలీసులు అరెస్టు చేశారు. వారందరిని నగరపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు.