తాజాగా లారీ డ్రైవర్లు చేసిన మరో హత్య మరొక్క సారి దిశ కేసును గుర్తుకు తెస్తున్నది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ గ్రామ శివారులోని ఇసుక స్టాక్యార్డులో పూర్తిగా కుళ్లిపోయిన మహిళ మృతదేహం బయటపడటంతో ఒక్క సారిగా రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది.
శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి పనుల కోసం ఆన్ లైన్లో ఇసుకను ఆర్డర్ చేసి, డెలివరీ తీసుకున్నాడు. వచ్చిన ఇసుక ఒక పుర్రె కనిపించింది. దీంతో వెంటనే యార్డుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. యార్డులో మృతదేహానికి సంబంధించిన ఇతర భాగాలు కనిపించాయి. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉంది.
గాజులు, చిరిగిపోయిన చీర, రుద్రాక్షలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. స్టాక్ యార్డులోని ఇసుకకు కొన్ని నెలల కిందట మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లి గ్రామం నుంచి తీసుకొచ్చారని, అందులో శవం బయటపడిందని స్టాక్యార్టు ప్రాజెక్టు అధికారి నిరంజన్ తెలిపారు. బహుశా లారీ డ్రైవర్లు శవాన్ని ఇసుకలో దాచి తీసుకొచ్చి, డంప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
యార్డుకు వచ్చిన లారీ వివరాలను, చుట్టుపక్కల ప్రాంతాల్లో నమోదైన మిస్సింగ్ కేసులను లింకు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. దిశను నలుగురు లారీ డ్రైవర్లు, క్లీనర్లు హత్యాచారం చేసినట్లు కేసు నమోదు కావడం, వారిని పోలీసులు కాల్చి చంపడం తెలిసిందే.