ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారుగా పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చించేందుకు ప్రతిపక్షం సమాయత్తం అవుతుండగా తాము సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచేందుకు అధికార పక్షం కసరత్తు చేస్తున్నది.
20 ప్రధానాంశాలపై సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 3 నుంచి 5 బిల్లులు ప్రవేశపెట్టే యోచనలో ఉంది. సోమవారం తొలిరోజున ‘దిశ’ హత్యోదంతంపై చర్చించనున్నారు. నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ… ప్రభుత్వం చేసిన చట్టంపై మరోసారి సభలో మాట్లాడనున్నారు. పాఠశాల విద్యలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం వంటి అంశాలపై చర్చించాలని ప్రభుత్వం సిద్ధమైంది. శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశాన్ని రేపు ఉదయం సభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక నిర్వహించనున్నారు.