ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు చాలా చోట్ల అధికార పార్టీ బెదిరింపులకు లొంగడం లేదు.
మరీ అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రాపకంతో పోస్టింగులు తెచ్చుకున్న వారు తప్ప సాధారణంగా తమ డ్యూటీ తాము చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీ పెద్దల బెదిరింపులకు లొంగడం లేదనే రిపోర్టులు వస్తున్నాయి.
మంత్రి స్థాయి వ్యక్తి బెదిరించడంతో ఒక్క సారిగా అయోమయంలో పడిపోయిన కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన హామీతో ధైర్యం తెచ్చుకున్నారు.
ఎన్నికల సమయంలో గానీ ఆ తర్వాత ఈ కారణం చూపి కానీ ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను ప్రభుత్వం ఏమీ చేయలేదని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు.
రాజ్యాంగ రక్షణ ఉంటుందని ఎటువంటి విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భరోసా ఇచ్చారు.
పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందికి ధైర్యం చెప్పారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులు ఎస్ఈసీ రక్షణ కవచంలో ఉంటారని చెబుతున్నారు.
ఎలక్షన్ డ్యూటీలో ఉన్న అధికారులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా ఎస్ఈసీ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, దీనిపై సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయని స్పష్టం చేశారు.
ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్పై ముందస్తు పర్మిషన్ లేకుండా చర్యలను నిషేధిస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తామన్నారు.
ఎలక్షన్ స్టాఫ్ను బెదిరించే ప్రకటనలు అవాంఛనీయమని, అధికారులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు అనైతికమని ఆక్షేపించారు.
ఎలక్షన్ స్టాఫ్ను భయపెట్టే చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. మనుషులు మారుతుంటారని.. వ్యవస్థలనేవి శాశ్వతంగా నిలిచిపోతాయనే విషయం గుర్తించాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సూచించడం గమనార్హం.
ఎన్నికల కమిషనర్ ఇచ్చిన వివరణ తో రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఇప్పుడు చురుకుగా పని చేస్తున్నారు.