ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఫలితాల్లో తెలంగాణకు చెందిన ఎం .లావణ్య నాన్ లోకల్ కోటాలో 425 మార్కులకు గాను 281.5 మార్కులతో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపికయ్యారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోపన్పల్లి గ్రామం వ్యవసాయ కుటుంబానికి చెందిన లావణ్యకు చిన్నప్పటి నుంచి న్యాయవాది కావాలన్నది ఆశయం. బీకాం ఎల్ఎల్బీ చదువుకున్న ఆమె మల్కాజిగిరి కోర్టులో ఏడేండ్లుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
భర్త క్యాబ్ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. బుధవారం లావణ్య మాట్లాడుతూ.. తన భర్త బాల్రెడ్డి, అత్తమామల సహకారంతోనే తాను పరీక్షల్లో విజయం సాధించానన్నారు. నాన్ లోకల్ కోటాలో ఉద్యోగం రావడం ఆనందంగా ఉందన్నారు. ఇకపై తన ఉద్యోగానికి న్యాయం చేస్తూనే, ఇప్పటివరకు తన కుటుంబం పడిన బాధలను దూరం చేస్తానని లావణ్య అన్నారు.