పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం ఆయన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు.
నిన్న ఆయన ఖైబర్ ఫఖ్తూన్ ఖ్వాలో విస్తృతంగా పర్యటించారు. మలాకండ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
అక్కడి విద్యార్ధులతో ఆయన ఇష్టాగోష్టి నిర్వహించారు. అక్కడే స్వాత్ లోయలో మోటార్ వే ను ఆయన ప్రారంభించారు. అక్కడే స్వాత్ లోయలో సొరంగ మార్గం ఎక్స్ ప్రెస్ వే ను ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని ఇస్లామాబాద్ వచ్చి తర్వాత ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్ వచ్చినట్లు ఆయన ఆరోగ్య పర్యవేక్షకుడు డాక్టర్ ఫైసల్ సుల్తాత్ వెల్లడించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఐసోలేషన్ లో ఉన్నారని ఆయన తెలిపారు.
పాకిస్థాన్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 3,876 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో పాజిటివిటీ రేటు 9.4 శాతానికి చేరుకుంది.
తాజా కేసులతో కలుపుకుని దేశంలో ఇప్పటి వరకు మొత్తం 6,23,135 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 40 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.