శివరాత్రి పండుగను పురస్కరించుకొని తెలంగాణ పర్యాటక శాఖ హైదరాబాద్ నుంచి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానానికి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో అందిస్తోన్న ఈ సేవలను రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచనల మేరకు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ బేగంపేట విమానాశ్రయంలో వేములవాడ శాసన సభ్యుడు సిహెచ్ రమేష్ బాబు తో కలిసి ప్రారంభించారు.
ఎమ్మెల్యే రమేష్ బాబు దంపతులు హైదరాబాద్ నుండి వేములవాడ హెలికాప్టర్ లో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ నేటి నుంచి 23వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్ నుంచి వేములవాడ, తిరుగు ప్రయాణానికి కలిపి టికెట్ ధర రూ.30 వేలుగా నిర్ణయించినట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. వేములవాడ నుంచి వ్యూ పాయింట్ టికెట్ ధర రూ. 3 వేలు, వేములవాడ, మిడ్ మానేరు జలాశయం, పరిసర ప్రాంతాల పర్యటన టిక్కెట్ ధర రూ.5,500గా ఉంది. హెలికాప్టర్ ప్రయాణం భక్తులకు సరికొత్త అనుభూతులను మిగులుస్తుందని రమేష్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ ఆలయ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రానున్న బడ్జెట్లో మరో 200 కోట్లు వేములవాడ ఆలయ అభివృద్ధికి కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా తెలిపారని శాసన సభ్యుడు రమేష్ బాబు పేర్కొన్నారు.