కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత (సీఎస్ఎస్) కింద ఆంధ్రప్రదేశ్లోని పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో నూతన వైద్య కళాశాలలు ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. ఈ మూడు కాలేజీల్లో 150 ఎంబీబీఎస్ సీట్లు పెంచేందుకు అనుమతించినట్లు తెలిపారు. అలాగే రెండవ దశలో రాష్ట్రంలోని 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను బలోపేతం చేస్తూ కొత్త పీజీ కోర్సులు ప్రారంభించేందుకు 1040 పీజీ సీట్లు పెంచేందుకు అనుమతించినట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశవ్యాప్తంగా సీఎస్ఎస్ కింద మూడో దశల్లో దేశవ్యాప్తంగా 157 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. జాతీయ మెడికల్ కమిషన్ అందించిన సమాచారం ప్రకారం ఏపీలో 13 ప్రభుత్వ వైద్య కళాశాలలతో సహా 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పటికే సీఎస్ఎస్ కింద మంజూరు చేసిన 157 మెడికల్ కాలేజీల లిస్టులో లేని కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరినట్టు మంత్రి తెలిపారు. రూరల్ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు లేని ప్రాంతాల్లో జిల్లా ఆసుపత్రులు, రిఫరల్ ఆసుపత్రులకు అనుసంధానంగా వైద్య కళాశాలలు నెలకొల్పుతున్నట్లు మంత్రి తెలిపారు.
previous post