ఫిబ్రవరి 7 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన నిరవధిక సమ్మె లో ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాలుపంచుకోనున్నారు. సమ్మె నోటీసుపై కార్యాచరణ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శిగా ఆర్టీసీ కార్మిక సంఘం ఈయూ అధ్యక్షుడు వైవీ రావు కూడా సంతకం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని కూడా అంటున్నారు.
ఉద్యోగులు ఎవరూ అసభ్య వ్యాఖ్యలు చేయొద్దని, శాంతియుతంగా ఉద్యమం కొనసాగించాలని ఉద్యమ నాయకులు విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దని ఉద్యోగులను కోరుతున్నామని స్పష్టం చేశారు. ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, 4 జేఏసీలు కలిసి పీఆర్సీ సాధన కమిటీగా ఏర్పడినట్టు వెల్లడించారు.
ఫిబ్రవరి 7 నుంచి ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 23న ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయని అన్నారు. ఈ నెల 24న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇస్తామని పేర్కొన్నారు. కొత్త జీతాలు అన్యాయంగా ఉన్నాయని, చర్చలు పూర్తయ్యేవరకు పాత పద్ధతిలోనే జీతాలు ఇవ్వాలని కోరుతున్నామని, తమ డిమాండ్లలో న్యాయం, ధర్మం ఉన్నాయని వివరించారు. పీఆర్సీ నివేదికను పూర్తిగా బహిర్గతం చేయాలని, దానిపై మరలా చర్చలు జరపాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.