36.2 C
Hyderabad
May 8, 2024 15: 10 PM
Slider ముఖ్యంశాలు

లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులు

#harish rao

ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో డిజిటల్‌ కార్డులు అందిచబోతున్నది. ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రూ.2 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్తగా కార్డులను జారీ చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో మంత్రి హరీశ్‌ రావు ఆధ్వర్యంలో బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు.

ఇందుకు లబ్ధిదారుల ఈ-కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిమ్స్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్‌ ఆడిట్‌ నిర్వహించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ రోగులకు బయోమెట్రిక్‌ విధానంతో కొంత ఇబ్బంది ఎదురవుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో ఫేస్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి అనుమతి ఇచ్చారు.

సమావేశంలో హెల్త్‌ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, డీపీహెచ్‌ శ్రీనివాస్‌ రావు, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని బోర్డు నిర్ణయించింది. మరింత నాణ్యంగా డయాలసిస్‌ సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌ పర్యవేక్షణ జరిపేలా ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ రూపొందించి, వినియోగించడానికి బోర్డు అనుమతి ఇచ్చింది.

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 3 డయాలసిస్‌ కేంద్రాలు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వాటి సంఖ్యను 103కు పెంచింది. ఫలితంగా డయాలసిస్‌ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నియోజకవర్గ కేంద్రంలోనే డయాలసిస్‌ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. కిడ్నీ బాధితులకు ఇవి వరంగా మారాయి.


కరోనా సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్‌ ఫంగస్‌ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడిన కోఠి ఈఎన్టీ దవాఖానకు రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగుచేసే ‘కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు’ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్టీ దవాఖానలో ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్నది. ఇకపై ఈ తరహా సేవలను వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానలో కూడా అందుబాటులోకి తేవాలని కమిటీ నిర్ణయించింది.

Related posts

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రోజా

Satyam NEWS

థర్టీ ఫెలో మూవీ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన దర్శకుడు నక్కిన

Bhavani

మే నెలలో ఉభయ తెలుగు రాష్ట్రాల పద్య నాటక పోటీలు

Satyam NEWS

Leave a Comment