ఈ నెల 27 న చేపట్టే గణేష్ శోభాయాత్ర, నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి అధికారులతో ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిమజ్జనానికి ముందు, నిమజ్జన సమయం, నిమజ్జనం తర్వాత చేపట్టాల్సిన చర్యలపై పటిష్ట ప్రణాళికతో కార్యాచరణ చేయాలన్నారు.
ప్రతి పాయింట్ కు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆయన తెలిపారు. 15 క్రేన్ల ఏర్పాటు చేయాలని, ప్రతి క్రేన్ కి బఫర్ డ్రైవర్ అందుబాటులో ఉంచాలని, సరిపోవు వెలుతురు, పబ్లిక్ అడ్రెస్ సిస్టం ఉండాలని అన్నారు. నిమజ్జనం త్వరగా పూర్తికి రిలీజింగ్ క్లాoప్ ల ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎన్సీసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సేవలు ఉపయోగించు కోవాలన్నారు. ఫిషర్ మెన్, స్విమ్మర్లను షిఫ్ట్ ల వారిగా విధులు కేటాయించి, వారి వివరాలు సమర్పించాలన్నారు.
విగ్రహాలు త్వరగా వచ్చేలా నిర్వహకులతో చర్యలు తీసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. శోభాయాత్ర మార్గంలో లూజ్ వైర్లు, కరంట్ తీగల సమస్యలు లేకుండా చూడాలని, అవసరమైన సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని అన్నారు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి.
మధుసూదన్ నాయక్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు డిసిపి కె.ఆర్.కె. ప్రసాద్ రావు, ఆర్డీవో లు జి. గణేష్, అశోక్ చక్రవర్తి, ఎస్డీసి రాజేశ్వరి, ఎసిపిలు, మత్స్య శాఖ ఏడి ఆంజనేయ స్వామి, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.