ప్రస్తుతం విశాఖకు 450 కి.మీ దూరంలో గంటకు 20 కి.మీ.ల వేగంతో ఈ తుపాను పయనిస్తోంది. రేపట్నుంచి వర్షాలు మొదలై 11వ తేదీ ఉదయానికి వర్షాలు ఎక్కువవుతాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఈ తుపాను విశాఖ సమీపానికి చేరిన తర్వాత తిరిగి ఒడిశా వైపుగా పయనిస్తూ అక్కడి తీరంలోనే బలహీనపడే అవకాశాలున్నాయని తుపాను కేంద్రం అధికారులు తెలిపారు.
అలాగే తుపాను వల్ల రేపు ఉదయం నుంచి రెండు రోజుల పాటు ఉత్తర కోస్తాలో వర్షాలు ఎక్కువగా పడే అవకాశముందని అధికారులు చెప్పారు. విశాఖలో తీరం వెంబడి ప్రస్తుతం 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు తూర్పు గోదావరి జిల్లాపై ఈ తుపాను ప్రభావం కనిపిస్తుంది. విశాఖ నుంచి తుని వరకు వాతావరణం ఉదయం నుంచి చల్లబడింది. కొన్ని చోట్ల చినుకులు పడుతున్నాయి. గాలుల ప్రభావం కనిపిస్తోంది. సముద్రంలో అలల తీవ్రత క్రమంగా పెరుగుతోంది.
రేపటి నుంచి 12వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తుని, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. అలాగే విశాఖ నుంచి కాకినాడ వరకు అతిభారీ వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
అలాగే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయి. తుపాను ప్రభావిత ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో రేపు ఉదయం 5 గంటల నుంచి వర్షాలు పడతాయి. అసని తుపాను ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మధ్య ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో… దీనిని ఎదుర్కొనేందుకు తూర్పు నౌకాదళం సిద్ధమైంది.