అక్రమని విజయ నిర్మల కాదు. ఎం.ఎల్.సి వంశీ కృషా యాదవ్ కాదు. ఎంపీ ఎం.వి.వి కాదు. పంచకర్ల రమేష్ కాదు…. మరి ఎవరు? ఇదే పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న వైసీపీ అధిష్టానానికే సవాల్ గా ఉంది. ఇది విశాఖ తూర్పు నియోజకవర్గ పరిస్థితి.. అక్కడ ఒక్క పేరు…. వైకాపా నాయకులకు…. మరి ముఖ్యం సీఎం జగన్ కు మింగుడు పడని పేరు వెలగపూడి రామకృష్ణ బాబు. టీడీపీ తరపున హ్యాట్రిక్ విజయాలు సాధిస్తూ వస్తున్న వెలగపూడి ఈ నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించారు. రాజకీయంగాను, వ్యక్తిగతం గాను మంచి పేరు పొందారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై పోరాడటం లోను ముందు ఉంటారు వెలగపూడి. 2019 జగన్ వేవ్ లో సైతం హ్యట్రిక్ విజయం సాధించారు.
పైగా ఇక్కడ సామాజిక వర్గ ప్రజలు వెలగపూడి కే పట్టం కడుతూ వస్తున్నారు. ఈసారి ఎలాగైనా వెలగపూడి ని ఓడించాలి అని జగన్ కంకణం కట్టుకున్నారు. దీనిలో భాగంగా విజయసాయిరెడ్డి కి పని అప్పగించారు. నియోజకవర్గంలో వైకాపా ముఖ్య నాయకులను రంగంలోకి దించింది. సీన్ కట్ చేస్తే విజయసాయి రెడ్డి స్థానంలో జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి వచ్చి చేరారు. సాయిరెడ్డి ఇన్ చార్జిగా ఉన్నప్పుడు నియోజకవర్గ బాధ్యతలు వుడా చైర్మెన్, 2019 లో పోటీ చేసి ఓడిన అక్రమని విజయ నిర్మాలకే అప్పగించారు. కొన్ని రోజులు విస్తృత స్థాయిలో నియోజకవర్గంలో పర్యటించారు.
ఆమె భీమిలి కి చెందిన వ్యక్తి అని, స్థానికులకు సీటు ఇస్తే వెలగపూడి పై గెలవచ్చు అని వైకాపా లో మరో వర్గం వాదిస్తోంది. దీనిలో భాగంగా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్.ఎల్.సి వంశీ కృష్ణ యాదవ్ పేరు పరిశీలన చేస్తున్నట్టు టాక్. ఐతే గతంలో వెలగపూడి చేతిలో వంశీ ఓడిపోయారు. పైగా ఆర్థికంగా కూడా వంశీ దెబ్బటునట్టు టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని ముఖ్య నాయకుల వద్ద ప్రస్తావించినట్టు చెబుతున్నారు. ఇప్పుడు నూతన నగర అధ్యక్షులు పంచకర్ల రమేష్ ను పోటీలో నిలిపితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నట్టు అంటున్నారు.
అయితే పంచకర్ల చూపు పెందుర్తి వైపు ఉంది. ఆయన గతంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి పెందుర్తి నుండి విజయం సాధించారు. అలాగే 2014 యాలమంచిలిలో టీడీపీ నుండి గెలిచి 2019 లో ఓడి, టీడీపీ ని వీడి వైకాపా లోకి వచ్చారు. ఈయన కూడా విశాఖ తూర్పు నుండి పోటీకి సుముఖంగా లేనట్టు ఇన్ సైడ్ టాక్. వెలగపూడి మీద గెలవాలి అంటే.. అంగ అర్ధ బలంతో పాటు ఆర్థికంగా బలమైన నేతను దించాలని వైకాపా ఆలోచన చేస్తుంది. దీనిలో భాగంగా ఆర్థికంగా బలంగా ఉన్న విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ ను బరిలో ఉంచితే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉందని కొందరు నేతలు భావించారు. ఈ విషయమై ఎంపీ ని సంప్రదించగా వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.
ఎం.ఎల్.ఏ గా పోటీ చేసే ఆలోచన గాని అసలు విశాఖ లో వ్యాపారం చేసే ఉద్దేశం గానీ లేదు అని ఇప్పుడు ఒప్పుకున్న ప్రాజెక్టు లు పూర్తి చేసి విశాఖ లో వ్యాపారాల సైతం ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు సన్నిహితుల భోగట్టా. వీళ్ళు ఎవరు కుదరకపోతే మళ్లీ అక్రమనికే టికెట్ ఇస్తే మళ్ళీ వెలగపూడి విజయం నల్లేరుపై నడకే అని ఆ నియోజకవర్గ వైకాపా నాయకులే చెవులు కోరుక్కోవడం కొసమెరుపు. కొత్త నేతని బరిలో దించుతాం అని మరి కొందరు వైకాపా నేతలు చెబుతున్నా ఎవరా ఆ నేత అనే పేరు మాత్రం చెప్పడం లేదు. వెలగపూడి రామకృష్ణ బాబు పై సమరానికి ఎవరు ని పంపిస్తారో వేచి చూడాల్సిందే.
రామకృష్ణ పూడి, సత్యంన్యూస్.నెట్, విశాఖపట్నం