రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవం పురస్కరించుకుని హైద్రాబాద్ లో జరిగిన వేడుకల్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు మున్సిపల్ ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో చోటు దక్కింది.అందుకు గాను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదగా ఉత్తమ సేవా పత్రం, మెమెంటో ను మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి అందుకున్నారు.
గొంగళి పురుగులా ఉన్న ఖమ్మం ను సీతాకొక చిలుకలా మార్చిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిపై మంత్రి కేటిఆర్ ప్రశంసల జల్లు కురిపించారు.ఖమ్మం కు ఈ-మున్సిపల్ ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఉత్తమ పురస్కారం అందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
అందుకు కృషి చేసిన మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.ఈ అవార్డ్ తో తమపై బాధ్యత మరింత పెరిగిందని, ముఖ్యమంత్రి కేసీఅర్, పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ నేతృత్వంలో ఖమ్మం ను అన్ని రంగాల్లో మరింత అభివృద్ది సాధిస్తామని పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు.