కడప జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్ హరికిరణ్ అన్నారు. అయితే వీలైనంత వరకు ఇళ్ల నుంచి బయటకు రావడం తగ్గించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
నిత్యావసర వస్తువుల, మెడిసిన్,కూరగాయల అమ్మకాలు తప్ప మిగతా వ్యాపారాలు బంద్ చేయాలని కలెక్టర్ అన్నారు. జనతా కర్ఫ్యూ విజయవంతం చేసిన విధంగానే ఈ నెల 31 వరకు కొనసాగించాలని ఆయన కోరారు. రైళ్లు, ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేశామని, జిల్లాలోని అన్ని షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, బస్సులు, ఆటోలు, పాఠశాలలు, కళాశాలలు, జిమ్స్,స్విమ్మింగ్ ఫుల్స్ వస్త్ర వ్యాపారాలు మూసి వేయాలని ఆయన కోరారు.
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేసిన వారి పై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గల్ఫ్ దేశాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక శాతంలో కడప జిల్లాకు చెందిన వారు వెనక్కు వచ్చారని ఆయన తెలిపారు. దాదాపు 2805 మంది వివిధ దేశాల నుండి మన జిల్లాకి వచ్చారని వాలంటీర్ల ద్వారా వారి సమాచారం సేకరించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నామని కలెక్టర్ అన్నారు.
వారందరు కూడా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ సూచనలు అమలు చేయడానికి ప్రజలను అప్రమత్తం చేయడానికి మండలంలో తహసీల్దార్ చైర్మన్ గా వ్యవహరిస్తారని, వారి ఆధ్వర్యంలో అన్ని నివారణ, నియంత్రణ చర్యలు చేపడుతూ అవగాహన కల్పిస్తారని ఆయన అన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం లో 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 08562- 254259,259179 ఈ రెండు నంబర్లకు ఎప్పుడైనా సంప్రదించవచ్చునని అన్నారు. నిత్యావసర వస్తువులను ఎమ్మార్పీ ధరలకంటే ఎక్కువ అమ్మితే 1077, 08562.. 246344 కు ఫిర్యాదు చేయవచ్చునని కలెక్టర్ అన్నారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే 10 వ తరగతి పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ ప్రకటించారు. రేషన్ సరుకులను ఈ నెల 29 వ తేదీకి ప్రతి లబ్దిదారునికి అందజేస్తామని కలెక్టర్ చెప్పారు.